సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదని నిర్మాత బోనీ కపూర్ అన్నారు. జనాలు ఎక్కువ మంది రావడంతోనే ఈ ఘటన జరిగిందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ప్రేక్షకులకు హీరోలపై అభిమానం ఎక్కువని తెలిపారు. రజినీ కాంత్, చిరంజీవి, మహేశ్ బాబు వంటి స్టార్ల సినిమాలకు అభిమానులు ఇలానే వస్తారన్నారు. కాగా తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ బెయిల్పై విడుదలయ్యారు.
కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లాడు. అయితే బన్నీ రాకతో జనం అతడిని చూసేందుకు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెలలో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలుతో బన్నీ మరునాడే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పుష్ప నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాన్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు.