Minister Ponguleti : యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ : మంత్రి పొంగులేటి
ప్రస్తుత యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్లో క్వింటాకు రూ.500 చొప్పున మొత్తం రూ.1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు.
వరి వేస్తే ఉరే అనే పరిస్థితిని దాటి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేర్చాం. యాసంగి పంటలకు ఏ సమస్య లేకుండా సాగునీరు అందించడంతో ఈ సీజన్లోనూ రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు తొందరపడి సన్నాలను దళారులకు విక్రయించొద్దు’’ అని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.