హైదరాబాద్ నగరంలో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా నగరంలో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్జాదిగూడలో 4 లక్షల 50 వేల రూపాయలకు శిశువును ఆర్ఎంపీ శోభారాణి విక్రయించగా..ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.
చిన్నారులను కొనుగోలు చేసిన బాధితుల వాదన మరోలా ఉంది. తమకు పిల్లలు లేక పోవడంతో చిన్నారులను కొనుగోలు చేశామని బాధితులు రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. రెండేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను తమ వద్ద నుంచి పోలీసులు లాక్కేళ్లారని కన్నీటి పర్యంతం అయ్యారు. చిన్నారులను తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు.