సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. ‘రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని అందులో కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేక షో వేయాలన్నారు. కాగా తెలంగాణలో రజాకార్ల అకృత్యాల ఆధారంగా చిత్రీకరించిన ‘రజాకార్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. కాగా, ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్లో చిత్రబృందంతో కలిసి బండి సంజయ్ రజాకార్ సినిమాను వీక్షించారు.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని బండి సంజయ్ సూచించారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన సినిమా దర్శక, నిర్మాతలకు, చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు.
ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న 'రజాకార్' సినిమాను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ఇలాంటి సందేశాత్మక చిత్రాలను వీలైనంత ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.