సీఎం రేవంత్ విదేశీ టూరు షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు. పెట్టుబడులను ఆకర్శించే లక్ష్యంతో సీఎం విదేశాల్లో పర్యటించి పలు సంస్థలు, కంపెనీలు, పెట్టుబడిదారులతో మమేకమవనున్నారు. ఎంవోయూలు చేసుకోనున్నారు.
ఆ దేశాల్లోని పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టు బడులను సమీకరించే అవకాశం ఉందని తెలిసింది. విదేశీ పర్యటనకు సీఎంతోపాటు పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం నేతృత్వంలోని బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది. న్యూయార్క్, డల్లాస్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూ జెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఎం సమావేశం అవుతారు. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.
న్యూజెర్సీలో ఆయన ప్రవాస భారతీ యుల నుద్దేశించి ప్రసంగించనున్నారు. దక్షిణ కొరియా పర్యటనలోనూ ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్, లైఫ్సెన్స్, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమా వేశం కానున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చేస్తున్న రెండో విదేశీ పర్యటన ఇది.