సీఎం రేవంత్ ( Revanth Reddy ) నేడు పాలమూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఇతర నేతలతో చర్చిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు.
మొన్న వరంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ను మరో హైదరాబాద్గా తీర్చిదిద్దాలన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్షించనున్నారు.