తెలంగాణలో రాజకీయం ముదిరింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది బిఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి మూడు నెలలు పూర్తి కావస్తోంది. దీంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది గులాబీ పార్టీ.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైనా విచారణ జరగాల్సి ఉంది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకొని.. దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది బీఆర్ఎస్.
దానం నాగేందర్ తో ( Danam Nagender ) పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది.