ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ హాజరుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బోధనా తరగతులు సమతుల్యంగా జరగడంతోపాటు విద్యా ప్రమాణాలు పెంచి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని భావిస్తోంది. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది. కార్పోరేటు, ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ సర్కారు స్కూళ్లలో పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. కార్పోరేటుకు ధీటుగా విద్యారంగంలో విద్యతోపాటు క్రీడా రంగంలో సర్కారు స్కూళ్లు ప్రముఖ పాత్ర పోషించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
విధులకు హాజరయ్యే విషయంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం రోజు రోజుకు పెరిగిపోతోందని ప్రభుత్వం పలు సర్వేల ద్వారా ధృవీకరించుకుంది. రాష్ట్రంలో 623 మంది ఎంఈ వోలు ఉన్నారు. 1700 లకు పైగా కాంప్లెక్స్ హెచ్ఎంలు ఉన్నా ఉపాధ్యా యులు విధులకు ఎగనామంపెడుతుండడం పై సర్కారు సీరియస్ గా ఉంది. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు చుట్టం చూపుగా వస్తుండడంపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం కట్టడి చేసేందుకు ఫేషియల్ రికగ్నెజింగ్ సిస్టంను తీసుకు వచ్చింది. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు చేరుకొని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు రాగానే బయోమెట్రిక్ సిస్టమ్తో ఆన్లైన్లో హాజరును పొందుపరిచి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.