గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. దుబ్బాక విజయంతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. అదే మార్క్ వ్యూహం బల్దియా ఎన్నికల్లోనూ అమలు చేస్తోంది. స్టార్ క్యాంపేనర్లను రంగంలోకి దింపుతోంది. నగర వ్యాప్తంగా ప్రముఖులంతా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలతో ప్రజల దగ్గరకు వెళ్లి కేంద్రం అందిస్తున్న పథకాలను వివరించనున్నారు.
నగర శివార్లతో పాటు కోర్ సిటీలోనూ నాయకుల కార్యక్రమాలకు వ్యూహరచన చేశారు. ఇప్పటికే కీలక నేతలు జవదేకర్ నగరంలో పర్యటించగా.. ఇప్పుడు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య నగరంలోనే మకాం వేశారు. త్వరలోనే సాథ్వీ నిరంజన్, స్మృతి ఇరానీ, ఫడ్నవిస్ తదితర నేతలు ప్రచారం చేయనున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ తదితర నేతలు ప్రచారంలో పాల్గొనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బుధవారం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది.