హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 23న హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు వైన్స్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ ఆలయం వరకు జరుగుతుందని తెలిపారు.
హనుమాన్ జయంతిని హిందువులు ఎంతో ఘనంగా.. జరుపుకుంటారు. వీధి వీధినా ర్యాలీలు తీస్తూ.. హనుమ నామ జపం చేస్తుంటారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.