ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ ( ఆగష్టు 9)శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని అన్నారు.
గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు,ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు.
మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎక్కడ మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని అన్నారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.