Harish Rao : జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే సమస్యలు ఎట్ల తెలుస్తాయ్ : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోయాలేని పరిస్థితుల్లో ఉందని, సఫాయి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీజిల్ లేక గ్రామపంచాయతీ ముందు ఉన్న ట్రాక్టర్ ను 20 రోజుల నుంచి తీసే పరిస్థితి లేదన్నారు. చెత్త సేకరణకు ట్రా క్టర్ రావడం లేదు ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ' ట్రాక్టర్ కి కనీసం సర్వీసింగ్ చేసే పరిస్థితి లేదు. ట్రాక్టర్ కి ఇన్సూరెన్స్ చేపించ లేక, రోడ్ టాక్స్ కట్ట లేక చివరికి డీజిల్ కి కూడా డబ్బులు లేక తాళాలు ఎంపీడీవోకి అప్పచెప్పినమని కార్మికులు చెబుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి 10-20 శాతం కమిషన్ వస్తేనే డబ్బులు రిలీజ్ చేస్తు న్నారు. సఫాయి కార్మికులు కమిషన్ ఇవ్వరు కాబట్టి జీతాలు ఇవ్వడం లేదా..? హెలికాప్టర్ లో ఇంధనం పోయడానికి డబ్బులు ఉంటాయి కానీ ట్రాక్టర్ లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవా. మార్పు మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోయకపోవడమేనా? ఇదేనా మీరు తెచ్చిన మార్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎప్పుడు కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి.' అని హరీశ్ రావు అన్నారు.