HYD: దేశంలోనే తొలి లీప్ ఇంజిన్ ఎంఆర్వో సెంటర్
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ... వర్చ్వల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ
దేశంలోనే తొలి అంతర్జాతీయ విమానాల మరమ్మతు కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు అవుతోంది. శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ)లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) నెలకొల్పుతున్న లీప్ ఇంజిన్ ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ - MRO) సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త ఎంఆర్వో యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో లీప్ ఇంజిన్ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ను ఎంచుకున్న సఫ్రాన్కు అభినందనలు తెలిపారు. ఇది మన స్థానిక ఎంఎస్ఎంఈలకు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ విమానాల మరమ్మతు కేంద్రం భారత వైమానిక, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ నిలిచిందన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZలు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుండి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయన్నారు. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని, హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ ఎంఆర్వో, ఏరో ఇంజిన్ హబ్లలో ఒకటిగా నిలిచిందన్నారు.
ఏరోస్పేస్, రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని, 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించాయని వివరించారు. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమన్న రేవంత్ రెడ్డి.. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తెలంగాణ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసిందన్నారు.తమ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుందన్నారు. 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం రేవంత్ , తమ విజన్ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్కు అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని తాము ప్రయత్నిస్తున్నామని, బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.