RAINS: హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు

భారీగా స్తంభించిన ట్రాఫిక్‌... పార్సిగుట్ట, సనత్‌నగర్‌లో ఇద్దరు వ్యక్తుల గల్లంతు;

Update: 2024-08-20 03:30 GMT

హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి వర్షం దంచికొట్టింది. ఆకాశానికి చిళ్లులు పడ్డాయా అన్నట్లుగా పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మరించడంతో హైదరాబాద్‌లో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పార్సిగుట్ట, సనత్‌నగర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్షపు నీటిలో కొట్టుకుపోయారు.


హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరానికి ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. కాగా, పంజాగుట్టలోని అపార్టుమెంట్‌ సుఖ్‌ నివాస్‌ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది. షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్‌ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్యక్తి గల్లంతయ్యాడు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, కొంపల్లి, మాదాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ భారీ వర్షం కురిసింది.

మలక్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్ల, నాగారం, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్‌, ముషీరాబాద్‌, రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వే స్టేషన్‌ వద్ద ఆర్వోబీ నీట మునగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మలక్‌పేట రైల్వే స్టేషన్‌ నుంచి ముసారాంబాగ్‌, సంతోష్‌నగర్‌ వరకు, కోఠీ వైపు చాదర్‌ఘాట్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉస్మానియా మెడికల్‌ కాలేజీవద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Tags:    

Similar News