TG: హైడ్రా దూకుడుతో తెలంగాణలో ప్రకంపనలు
ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు... నెల రోజుల్లోపు ఖాళీ చేయాలని హైడ్రో నోటీసులు;
తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. హైడ్రా దూకుడుకు ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలపై చర్యలు తీసుకుని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ఈ నెల మూడో తేదీ నుంచి నిర్మాణదారులు, సంస్థల ప్రతినిధులకు నోటీసులిస్తున్నారు. వారం రోజుల నుంచి నెల రోజుల్లోపు నిర్మాణాలను ఖాళీ చేయని పక్షంలో తామే కూల్చేస్తామని చెబుతున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎక్కువగా నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్ని సివిల్ సర్వీస్ అధికారుల పేరుపై ఉన్నాయి.
ఐఆర్ఎస్ అధికారి చంద్రశేఖర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి క్యాంపు కార్యాలయం, కొన్ని సినీ ప్రముఖులకు చెందినవి ఉన్నాయి. సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి మాదాపూర్లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంది. వీటితో పాటు మాదాపూర్ పరిధిలోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ కాలనీ, డాక్టర్స్ కాలనీలో పలు నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. చెరువుల ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లలో ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సర్వే చేశారు. మాదాపూర్లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధుల్లో చాలామంది జీప్లస్3, మరికొందరు డూప్లెక్స్ ఇళ్లు నిర్మించుకున్నారు. పెద్ద చెరువు, గంగారం చెరువు, నల్లగండ్ల చెరువు, ఉప్పల్లో నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధుల్లోనూ ఈ తరహా నిర్మాణాలే ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు.
శేరిలింగంపల్లి మండల పరిధిలో దుర్గం చెరువుతో పాటు ఐదు చెరువులున్నాయి. వీటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధుల్లో 340 కట్టడాలను గుర్తించాం. వాటి వివరాలను రెండు నెలల క్రితమే హైకోర్టుకు అందజేశాం. ఆయా నిర్మాణాలను తొలగించేందుకు నిర్మాణదారులకు నోటీసుల్లో గడువు ఇవ్వాలని హైకోర్టు అదనపు ఏజీ ఈ నెల 2న లేఖ రాశారు. దీంతో ఆగస్టు 3న 240 మంది నిర్మాణదారులు, సంస్థల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చాం. మరో 72 కట్టడాలను గుర్తించి.. వాళ్లకూ వివరణ ఇవ్వాలని కోరాం.
దుర్గం చెరువు సమీపంలోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తాను కోనుగోలు చేసిన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అన్నారు. కూల్చివేసే ముందు కొంత సమయమిస్తే సామగ్రి తీసుకొని వెళ్తాను. బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి గురించి రాజకీయం చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే.. కాలనీవాసులందర్నీ సమస్యలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు’ అని విమర్శించారు.