తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రెండు రోజులుగా పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న జీవన్ రెడ్డి.. తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సంచలన లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందులో వివరించారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధను బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు జీవన్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్ పై మీరే నిర్దేశించండి అని ఖర్కేను కోరారు. గాంధీభవన్ వేదికగా జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా చెప్పాలని హైకమాండ్ ను ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు.