Kamareddy : కామారెడ్డి పాస్పోర్టు కార్యాలయం అగ్నికి ఆహుతి
కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైల్స్;
కామారెడ్డిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవాకేంద్రంలో శనివారం సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ తో ఆఫీసులోని కంప్యూటర్లు, ప్రింటర్లు, రూటర్లు, టేబుళ్లు తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పారు. అయితే అందులోనే పక్కనున్న పోస్టాఫీస్ కు మంటలు వ్యాపించకముందే చర్యలు చేపట్టడంతో భారీ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
కాగా, ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని డాక్యుమెంట్లు, ఇతర సామగ్రి కాలిపోయాయని పోస్టాఫీస్ అధికారులు వెల్లడించారు. అయితే మిగతా డేటా అంతా ఆన్లైన్లో ఉందని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటేనా? మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మేరకు ప్రమాదంపై స్పందించిన హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం.. కామారెడ్డి పోస్టాఫీసు, పాస్పోర్టు సేవాకేంద్రం సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రంలో ఫిబ్రవరి 26 నుంచి సేవలు పొందాల్సిన దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం చేరవేస్తామని స్పష్టం చేశారు.
అలాగే అత్యవసరం ఉన్నవారికి నిజామాబాద్ పాస్పోర్టు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్ని చెప్పారు. ‘అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవాలనుకునేవారు ఏ పాస్పోర్టు సేవాకేంద్రానికైనా లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవాకేంద్రానికైనా మార్చుకోవచ్చు’ అని తెలిపారు. మరిన్ని వివరాలకోసం rpo.hyderabad@mea.gov.in ను సంప్రదించాలని సూచించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.