లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009లో మహబూబ్నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా గెలిచి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
లోక్సభలో కేసీఆర్ తన వారసత్వాన్ని బిడ్డ కవితకు అప్పగించారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆమెను కేసీఆర్ బరిలోకి దింపారు. కవిత భారీ విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లి.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు.
కానీ, లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మీద ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. ఓటమి భయంతోనే ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీకి నిలబడలేదని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.