అనుభవం ఉన్న లీడర్లు సొంత ప్రయోజనాల కోసం మాట్లాడకుండా.. సభా మర్యాదలు పాటించాలని అసెంబ్లీ స్పీకర్ మాజీ మంత్రులు హరీశ్ ( Harish Rao ), కేటీఆర్ కు ( KTR ) సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు మైక్ ఇవ్వాలని పట్టుబట్టగా.. సభ నడవాలని లేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం10 గంటలకు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. అయితే సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్లాక్ డ్రెస్ వేసుకురావడంపై హరీశ్ రావు కామెంట్స్ చేశారు. ‘మా ఆవేదన అర్థం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు సార్’ అంటూ వ్యాఖ్యానించారు. సభలో మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీపై మాట్లాడుతుండగా. తమకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ వారిపై మండిపడ్డారు. మీకు సభ నడవాలని లేదా? బిల్లు పాస్ చేయాలని లేదా? అని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ‘మీరు సభ నాయకుడిపై మీకు ఇష్టమొచ్చినట్లు రుద్దకండి.. అనుభవమైన లీడర్లు మీరు.. మీ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడకండి.. సభా మర్యాదలు పాటించి కూర్చోండి’ అని అన్నారు.