ఈ నెల 5న పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో, అదే జిల్లాలోని బసంత్నగర్కు చెందిన గుంటిపల్లి రాము, ఆయన భార్య అనూష మరణించారు. వీరి మూడున్నర సంవత్సరాల కూతురు సహస్ర తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత కరీంనగర్కు, అక్కడి నుంచి మంగళవారం హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించారు. సహస్ర పరిస్థితిపై మీడియాలో వచ్చిన వార్తలు చూసి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు చలించిపోయారు. సహస్ర ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. చిన్నారి సహస్రకు పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మంత్రి ఆదేశాలతో హైదరాబాద్ డీఎంహెచ్వో, డాక్టర్ వెంకట్ రెయిన్బో హాస్పిటల్కు వెళ్లి సహస్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. సహస్ర వెన్నుపూసకు తీవ్రగాయమైందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు వివరించారు. సహస్రకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు డీఎంహెచ్వో వెంకట్ సూచించారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని హాస్పిటల్ యాజమాన్యానికి వివరించారు.