NARA LOKESH: "కొనసాగుతున్న ఆపరేషన్ నేపాల్"
అందర్నీ కాపాడతామన్న నారా లోకేశ్
నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవతో అధికారులు చర్యలు చేపట్టారు. నేపాల్ నుంచి పలువురు యాత్రి కులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు బయల్దేరారు. సిమికోట్లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్కు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లఖ్నవూ చేరుకున్నారు. లఖ్నవూ నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాఠ్మండూ సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటుచేశారు. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.
మంత్రి నారా లోకేశ్ చొరవ
ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏపీ వాసులు నేపాల్లోని కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి స్వదేశానికి వచ్చారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది తిరిగి వచ్చారు. కాఠ్మాండూ నుంచి ప్రత్యేక విమానం మొదటగా విశాఖ, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది.