తెలంగాణను భయపెడుతున్న కొత్త వైరస్
ఇప్పటికే లండన్ నుంచి ఇటీవల కాలంలో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు ప్రయాణికులు వచ్చారు. వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైద్యాధికారులు.;
తెలంగాణను మళ్లీ వైరస్ భయపెడుతోంది. ఈసారి కొత్తరకం కరోనా స్ట్రైన్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే లండన్ నుంచి ఇటీవల కాలంలో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు ప్రయాణికులు వచ్చారు. వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైద్యాధికారులు. కరీంనగర్ జిల్లాలో మళ్లీ టెన్షన్ మొదలైంది.బ్రిటన్ నుంచి ఇటీవల 16 మంది వచ్చినట్టు గుర్తించారు. వారిలో 10 మ మందిని గుర్తించి శాంపిల్స్ సేకరించారు. కాసేపట్లో వారి రిజల్ట్ రానున్నాయి. ఇంకా ఆరుగురుని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కొమురంభీం జిల్లా దహేగాం మండలానికి ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చిన ముగ్గురి శాంపిల్స్ సేకరించారు. 14 రోజుల కిందట ముగ్గురు బ్రిటన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. అందులో ఇద్దరి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. జహీరాబాద్కు 12 మంది, సంగారెడ్డికి 6 గురు, పఠాన్చెరువుకు ఏడుగురు, సదాశివపేటకు ఒకరు బ్రిటన్ నుంచి వచ్చారు. వారిలో 17 మంది రిపోర్ట్స్ నెగిటివ్ రాగా, మిగిలిన వారి రిపోర్ట్స్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు..
లండన్ నుంచి నల్గొండ జిల్లాకు ఎనిమిది మంది వచ్చారు. అక్కడ నుంచి ఒకరు విజయవాడ, మరొకరు నిజామాబాద్ వెళ్లారు. మిగిలిన ఆరుగురి ప్రయాణికులకు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయం పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ వచ్చే వరకు వారిని క్వారంటైన్లో ఉంచారు. సంగారెడ్డి జిల్లాకు గత 20 రోజుల్లో లండన్ నుంచి26 మంది వచ్చినట్టు తెలుస్తోంది. అందరినీ ఇప్పటికే ట్రేస్ చేసి శాంపిల్స్ సేకరించారు వైద్యాధికారులు. ఈ రోజు సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయని భావిస్తున్నారు. అప్పటి వరకు ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచారు..
ఖమ్మం జిల్లాను కొత్త వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ నుంచి ఇటీవల విడతల వారీగా 27 మంది వచ్చినట్టు సమాచారం. అందులో ఖమ్మం నగరానికి చెందిన వారు 20 మంది ఉన్నారు. మిగిలిన వారు సత్తుపల్లి, వైరా, తిరుమలాయపాలెం ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. వారందరన్నీ ట్రేస్ చేసి ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ ద్వారా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.