బీఆర్ఎస్ (BRS) పార్టీ ఏర్పడిన తర్వాత మొదటిసారి మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుటుంబం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. 2001 బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఏర్పడిన తర్వాత 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. ఆయన కుమార్తె కవిత కూడా 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె 2014లో గెలిచి, 2019లో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కవిత పోటీ చేయట్లేదు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్కుమార్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య (మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె) బరిలోకి దిగబోతున్నట్టు బుధవారం పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటికే ఖమ్మం (నామా నాగేశ్వరరావు), మహబూబాబాద్ (మాలోత్ కవిత), మహబూబ్నగర్ (మన్నె శ్రీనివాస్రెడ్డి), కరీంనగర్ (బోయినపల్లి వినోద్కుమార్), పెద్దపల్లి (కొప్పుల ఈశ్వర్) స్థానాలను ప్రకటించారు. ఈ 9 స్థానాల్లో మూడింటిని బీసీలకే కేటాయించడం విశేషం. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలను మున్నూరుకాపు, చేవెళ్లను ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించారు.