మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ( Dharmapuri Srinivas ) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారిని సీఎం సూచించారు. రేపు డీఎస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి.శ్రీనివాస్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని, ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
తన తండ్రి డి.శ్రీనివాస్ మరణంపైధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అన్నా అంటే నేనున్నానంటూ ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY. నా తండ్రి, నా గురువు అన్నీ నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది ఆయనే. నాన్నా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు’ అని పేర్కొన్నారు.