Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 8వ తేదీన చేపడతామని జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం తెలిపింది. అయితే విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అందుకే ఆయన బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్లో, ప్రభాకర్ రావు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు.
డేటా రికవరీ చేయడానికి కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదని, ఆయన ప్రభుత్వానికి అందజేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాప్టాప్లు ఫార్మాట్ చేసి ఉన్నాయని, వాటిలో ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు వివరించారు. అయితే తన క్లయింట్ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతున్నారని ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు.