CM Revanth Reddy : సీఎం రేవంత్ మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి?

Update: 2024-06-21 09:40 GMT

కేసీఆర్‌ లక్ష్మీ పుత్రుడిగా పేరున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy ) సీఎం రేవంత్ ( CM Revanth Reddy ) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ చెప్పడంతో ఈ ప్రచారం మరింత బలపడింది.

పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరమని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో రైతు సమస్యలపై తీసుకోనున్న కీలక నిర్ణయాల గురించి ఆయనతో చర్చించాం. మాకు అండగా ఉంటామని చెప్పారు. పార్టీలోని సీనియర్ల మాదిరే శ్రీనివాస్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వం చేపట్టే రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తారు’ అని సీఎం వివరించారు.

రైతు పక్షపాతిగా సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న మంచి పనులను మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాజకీయంగా ఇంకా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం మాత్రమే. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తా’ అని పోచారం వెల్లడించారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్నారు.

Tags:    

Similar News