మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, కళ్లు దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఐతే.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్లలోని బార్లు మాత్రం ఓపెన్ ఉంటాయి.
మంగళవారం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు దుకాణాలు మూసివేయబడతాయి. రాముని శోభాయాత్ర సందర్భంగా కూడా వైన్ షాపులు మూతపడ్డాయి. ఏప్రిల్ 23న జరిగే హనుమాన్ జయంతి ఊరేగింపు ముందుగా ప్రారంభించాలని, డీజే సిస్టమ్లను ఉపయోగించవద్దని, బాణాసంచా పేల్చవద్దని, గులాల్ చల్లుకోవద్దని నగర పోలీసు చీఫ్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కోరారు. ప్రజలను రెచ్చగొట్టేలా నినాదాలు, ఉపన్యాసాలు, పాటలు, బ్యానర్లను ఏర్పాటుచేయవద్దని సూచించారు.
శనివారం బషీర్బాగ్లో హనుమాన్ జయంతి నిర్వాహకులు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, పోలీసు, పౌర శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు సీపీ శ్రీనివాసరెడ్డి. యాత్రలో పాల్గొనేవాళ్లు.. కర్రలు, కత్తులు, మారణాయుధాలు తీసుకెళ్లడాన్ని నిషేధించామని చెప్పారు. డ్రోన్లు వాడితే ముందే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలన్నారు అధికారులు.