నేడు ప్రధాని మోదీ (PM Modi) నాగర్కర్నూల్లో పర్యటించనున్నారు. రాజ్భవన్ నుంచి ఉదయం బేగంపేట్ ఎయిర్పోర్టుకు వెళ్తారు. 10 గంటలకు ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నాగర్కర్నూల్కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు. మళ్లీ 18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే రూ.కోటికి పైగా అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ్టి ప్రధాని షెడ్యూల్ ఇదే…
* ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్కర్నూల్ చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు
* 1 గంటకు నాగర్కర్నూల్ నుంచి హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గాకు మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరుతారు.
* 18న తిరిగి రాష్ట్రానికి. ఆ రోజు షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
మోదీ తొలిసారి నాగర్కర్నూల్కు వస్తున్నందున భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అందుకోసం సభకు ఉమ్మడి జిల్లా, బీజేపీ పట్టు ఉన్న ప్రాంతాల నుంచే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని వెలమ సంఘం కల్యాణ మండపం సమీపంలో గల దాదాపు 15 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో సభకు వచ్చే ప్రజల కోసం భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. దాదాపు వంద మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు.