తెలంగాణలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ఈ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఈ ప్రక్రియ పూర్తయితే 10,449 మందికి SAలుగా, 778 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 6 వేలమంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. పదోన్నతులకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరని సెప్టెంబరు నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానికితోడు జీవో 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని ఉన్నత న్యాయస్థానంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేశారు.
అప్పటికే మల్టీ జోన్-1(వరంగల్)లో గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు, బదిలీలు పూర్తయ్యాయి. 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి తప్ప.. పదోన్నతులు పూర్తి కాలేదు. వారిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. ఎస్జీటీల బదిలీలు కూడా ఆగిపోయాయి.