TG : జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ అభివృద్ధికి సహకరించండి.. కేంద్రమంత్రికి రేవంత్ రిక్వెస్ట్
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్లో పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు కార్యక్రమం కింద ఆమోదించిన రూ. 596.61 కోట్లను సత్వరం విడుదల చేయాలని కోరారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని సీఎం అభ్యర్ధించారు. హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్క్ను ఏర్పాటు చేసిందని.. హైదరాబాద్ - బెంగళూర్ పారిశ్రామిక కారిడార్ను ఏరో-డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని సీఎం కోరారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని..కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని గోయల్ కోరారు.