ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించింది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పై కమిటీలతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.