Shilpa Chowdary: శిల్పా చౌదరి బ్యాంక్ అకౌంట్లపై నిఘా పెట్టిన పోలీసులు..
Shilpa Chowdary: ప్రముఖుల్ని మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యాపారవేత్త శిల్పా చౌదరి విచారణ కొనసాగుతోంది.;
Shilpa Chowdary (tv5news.in)
Shilpa Chowdary: వ్యాపారవేత్త శిల్పా చౌదరి విచారణ కొనసాగుతోంది. పెట్టుబడుల ముసుగులో ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు ఈమె ఆరోపణలు ఎదుర్కొంటోంది. శిల్పను ఒకరోజు కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టారు. కోకాపేటలోని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లి.. లావాదేవీలకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.
బ్యాంక్ లాకర్లో ఎలాంటి నగదు గానీ, బంగారం గానీ లభించలేదు. లాకర్లో సిగ్నేచర్ విల్లా జిరాక్స్ పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.తాను మల్టి స్పెషాలిటీ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టినట్టు శిల్పా పోలీసులకు చెప్పింది. ఆ హాస్పిటల్ సొసైటీకి సంబంధించిన డాక్యుమెంట్లనే పోలీసులు బ్యాంక్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
నిజంగానే పెట్టుబడులు పెట్టిందా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. హాస్పిటల్ సొసైటీ డాక్యుమెంట్లు విచారణలో కీలకం కానున్నాయి.సిగ్నేచర్ విల్లా ఒరిజినల్ పత్రాలు బ్యాంక్ లోన్లో ఉన్నాయని పోలీసులకు తెలిపింది శిల్ప. అలాగే హయత్నగర్లో 240 గజాల స్థలం ఉన్నట్లు చెప్పింది. సిగ్నేచర్ విల్లా, హయత్నగర్ ప్లాట్ అమ్మి బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తానని శిల్ప చెప్పినట్లు సమాచారం. అంతకుముందు శిల్పాచౌదరిని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోరారు. అయితే కోర్టు ఒక్కరోజుకే అనుమతిచ్చింది. గడువు ముగియడంతో బుధవారం ఉదయం తిరిగి ఉప్పర్ పల్లి కోర్టులో శిల్పను హాజరుపరచనున్నారు పోలీసులు.