రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ సబ్ కమిటీ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమైంది. 2011 జనగణన డేటాను ఉపయోగించుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలని ఈ సబ్ కమిటీ తీర్మానించింది. ఈ క్రమంలో, సుప్రీంకోర్టు లేదా, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏక సభ్య జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించాలని నేటి సమావేశంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కులాల్లో అంతర్గతంగా వెనుకబడి ఉన్న కులాలు ఏవో గుర్తించేందుకు ఈ కమిషన్ తో అధ్యయనం చేయించాలని భావిస్తోంది.