తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసును అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదించారు. విచారణ సందర్భంగా ముఖ్యమంత్రిపై, స్పీకర్ ఛాంబర్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 8 వారాల్లో నిర్ణయం తీసుకునేలా తీర్పు ఇవ్వాలని బీఆర్ఎస్ అడ్వకేట్ విజ్ఞప్తి చేస్తే... అలా స్పీకర్ను డిక్టేట్ చేసేలా తీర్పులు లేవని సింఘ్వీ తెలిపారు. దీంతో బెంచ్ కలుగుజేసుకొని అసలు రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూడాలా అని నిలదీసింది. న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆశిస్తున్నామని అన్నారు.