TS: సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశం.. వార్డుల విభజనకు 30 రోజుల గడువు.. ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదలకు ఛాన్స్;
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు సమయం వంటి అంశాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. కోర్టు తీర్పుతో సర్పంచ్ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ లో గడువు ముగిసినప్పటకీ.. ఏడాదిన్నర కాలంగా.. స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం నాడు జస్టిస్ మాధవి దేవి బెంచ్ విచారణ జరిపి.. తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
ఏడాదిన్నరగా....
2024 జనవరి 31వ తేదిన సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదు. కనుక సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈక్రమంలో బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
రిజర్వేషన్ల అమలుపై కసరత్తు
హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బీసీలకు ఇచ్చిన హమీ మేరకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు చేయనున్నారు. 42 శాతం మంది బీసీలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షితో పాటు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లపై విధానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్ 23వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం.