తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 23న ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది. ఆన్లైన్లో మార్కుల ఎంట్రీకి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో 23 లేదా 24వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను బోర్డు వెల్లడించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కాగా అటు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.