తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఈనెల 24న వెల్లడించాలని నిర్ణయించినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారని, ఫలితాలను https:// tsbie.cgg.gov.in, http://results. cgg. gov.in అనే వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. 9,80,978 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 10వ తేదీతో పూర్తి చేశారు.
పదో తరగతి పరీక్షల ఫలితాలను వచ్చే వారంలో వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ, స్కానింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం వెరిఫికేషన్ సాగుతోంది. వచ్చే వారంలో ఈ ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.