BANAKACHARLA: బనకచర్లపై ముదురుతున్న వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వేడి.. ఏపీపై తెలంగాణ సర్కార్‌ తీవ్ర ఆగ్రహం.. కేంద్రానికి ఉత్తమ్ కుమార్ లేఖ;

Update: 2025-06-15 03:45 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు పేర్కొనడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి ఉత్తమ్ లేఖ

ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు ఈ నెల 13న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాసిన తెలంగాణ మంత్రి, ఏపీ ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా నిలువరించాలని, టెండర్లు పిలవడం సహా ఏపీ ముందుకెళ్లకుండా చూడాలంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై మాజీమంత్రి, బీఆర్​ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపణలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని వివరించారు. ఏపీ సీఎం నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే, జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖ మంత్రులకు లేఖ రాసి అభ్యంతరాలు తెలిపామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని, మొదట్నుంచీ చట్టపరంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. హరీశ్ రావు వాదనలు నిరాధారం, తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణకు కృష్ణానదిలో నీటి కేటాయింపులను కేవలం 299 టీఎంసీలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు.

కాంగ్రెస్ మౌనం - హరీష్ రావు ఆరోపణలు

బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత   హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది నుండి 200 టీఎంసీల నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా కృష్ణా,  పెన్నా బేసిన్‌లకు తరలించడం వల్ల  తెలంగాణకు తీవ్ర నష్టం  జరుగుతుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తోందని ఆరోపించారు.  ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014 ఉల్లంఘన అని హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), ఎపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ,  కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాయన్నారు.  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటి హక్కుల గురించి నీతి ఆయోగ్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  కేంద్రం బనకచర్ల ప్రాజెక్టుకు 50 శాతం నిధులను గ్రాంట్‌ల రూపంలో ఇస్తూ, మిగిలిన నిధులను FRBM పరిమితుల మినహాయింపు ద్వారా సేకరించడానికి అనుమతిస్తోందని అన్నారు.  అదే సమయంలో తెలంగాణకు కాళేశ్వరం, సీతారామ,   పాలమూరు వంటి ప్రాజెక్టులకు ఇలాంటి సహాయం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News