TG: కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు
పలు చోట్ల ఘర్షణలు...కోర్లపహాడ్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
తెలంగాణలో తొలి విడత పంచాయతీల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగుతున్నారు. బుధవారం రాత్రి నల్గొండ జిల్లా కోర్లపహాడ్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్లు, కత్తులతో ఇరువర్గాలు దాడికి పాల్పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కొర్లపహాడ్ గ్రామంలో మోహరించారు. తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు:
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయి. ప్రతి ఓటరు సర్పంచ్కు ఒక ఓటు, వార్డు సభ్యుడికి ఒక ఓటు చొప్పున రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థికి: గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యుడికి: తెలుపు రంగు బ్యాలెట్ పత్రం. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు ఉండవు, కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేసి ఒకే బ్యాలెట్ డబ్బాలో వేయాలి. ఓటర్లకు అభ్యర్థులు నచ్చకపోతే, బ్యాలెట్ పత్రం చివరలో ఉన్న నోటా (NOTA) గుర్తుకు ఓటు వేయొచ్చు. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండటంతో పాటు, తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు (EPIC) తీసుకెళ్లాలి. అది లేని పక్షంలో, ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లెసెన్స్ వంటి 12 రకాల ఇతర గుర్తింపు కార్డుల్లో దేనినైనా పరిగణనలోకి తీసుకుంటారు. కౌంటింగ్లో ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఎన్నికైన వార్డు సభ్యులందరూ సమావేశమై తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఓటర్లు తమ పని వేళలు చూసుకుని, మధ్యాహ్నం 1 గంటలోపు తప్పకుండా ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.