TG: ప్రపంచం చూపంతా"గ్లోబల్ రైజింగ్" వైపే
నేటి నుంచి తెలంగాణ గ్లోబర్ రైజింగ్ సమ్మిట్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్.. తరలివస్తున్న దేశ, విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు
తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికైంది. నేడు, రేపు ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ - 2025 సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్లోబల్ సమ్మిట్కు దేశ, విదేశాల నుంచి రానున్న ప్రతినిధులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మహా నగరాన్ని అందంగా ముస్తాబు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేక ఎట్రాక్షన్స్ మేళవింపుతో జరుగుతున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా..
గ్లోబల్ సమ్మిట్కు రానున్న ప్రముఖులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సెక్రెటేరియట్ వద్ద అద్భుతమైన త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్తో రాష్ట్ర అభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ - 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ఇన్లిట్ టెక్నిక్తో అద్భుతంగా ప్రదర్శించనున్నారు.
వాటర్ ప్రొజెక్షన్లో ముఖ్యాంశాలుహుస్సేన్సాగర్లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం లాంటి ముఖ్య అంశాలను చూపించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం ఉంటుంది వంటి వివరాలు పొందు పరచనున్నారు. గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. సమ్మిట్ వేదిక వద్ద లోపలికి వెళ్లే మార్గాన్ని మొత్తం ఆధునిక త్రీడీ ఎనీ మార్ఫిక్ డిజైన్లతో రూపొందిస్తున్నారు. 50 మీటర్ల పొడవుతో డిజిటల్ టన్నెల్ను ఇంటరాక్టివ్ డిస్ ప్లే రూపంలో ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని పది వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడున్న వలంటీర్లు ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూల్ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.