CM: రేవంత్రెడ్డి ఇంటి వద్ద పటిష్ట భద్రత
జూబ్లీహిల్స్లోని నివాసం వద్దే ప్రజా దర్బార్... ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్రెడ్డి ఇంటి వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని నివాసం వద్ద కొద్దిరోజులు ప్రజాదర్బార్ నిర్వహించే అవకాశం ఉండటంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం ఇంటికి వీఐపీలు సహా పలువురు అధికారులు వచ్చే అవకాశం ఉంటడంతో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కసరత్తు చేస్తున్నారు. మఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ రోడ్నెంబర్44లో నివాసంలోనే ఉండాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అక్కడే కొద్ది రోజులు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని సూత్రప్రాయ ఆదేశాలు రావడంతో అధికార యంత్రాంగం బందోబస్తు సహాఇతర ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నివాసానికి తరచూ ప్రముఖులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల రాకపోకలుంటాయి. భారీగా తరలివచ్చే వాహనాలకు పార్కింగ్ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. సీఎంకి పదుల సంఖ్యలోవాహనాలతో కాన్వాయ్ ఉన్నందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడకి పెద్దసంఖ్యలో తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు సివిల్ పోలీసులు ఆ తర్వాత దశలో ఆర్ముడ్ రిజర్వ్కి చెందిన సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలు విధుల్లో ఉన్నాయి.
నేటి నుంచి సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. రేవంత్ నివాసం, తన పార్లమెంట్ కార్యాలయం దగ్గర బారికేడింగ్ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా.. వచ్చిన వాహనాలు సజావుగా తిరిగి వెళ్లేందుకు ఏమార్గాలు ఎంపికచేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, అంతర్గత భద్రతా విభాగం, ట్రాఫిక్ విభాగం అధికారులు అక్కడ పరిస్థితులు, భద్రతాపరంగా ఉన్నలోపాలు, వాటిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు రూట్మ్యాప్ అన్ని స్వయంగా పరిశీలించనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో పెద్దమ్మగుడి నిత్యం రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులన్నింటిపై రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు సమీక్షించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి నివాసం, పార్లమెంటు కార్యాలయానికి సమీపంలో విద్యుదీకరణ స్థానికంగా ఇతర అదనపు పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
మరోవైపు తెలంగాణలో కొత్తప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. రేపు ఉదయం పదిన్నరకి LB స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సీఎల్పీ నేత, మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేట్లు మంత్రి వర్గ కూర్పు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.