హైదరాబాద్ లో శ్రీరామ శోభాయాత్ర సందర్బంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనం సహకరించాలని కోరారు. తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇతర మార్గాల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
శ్రీరాముడి శోభాయాత్ర జరుగుతున్నందున యాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. శ్రీరామ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి ప్రారంభమవుతుంది. శోభాయాత్ర బోయగూడ కమాన్, మంగళహాట్, దూల్పేట్, పురానాపూల్, బేగంబజార్, గౌలిగూడ, కోఠి మీదుగా హనుమాన్ వ్యాయమశాలకు చేరుకుంటుంది.
ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే శోభాయాత్ర వెళ్తుంది. మరో దారిలో ర్యాలీకి అనుమతి ఉండదు. జనం కూడా డైవర్షన్ రూట్స్ ను ఉపయోగిస్తేనే ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉంటారని పోలీసులు తెలిపారు. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. టూ వీలర్లు, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలు.. ఓల్డ్ సిటీలోని సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయమ శాల మధ్య ఉన్న శోభాయాత్ర రూట్ ను స్కిప్ చేయాలని పోలీసులు కోరారు.