TG : అందరికీ ఆరోగ్యశ్రీ.. రేషన్ కార్డు లింక్ పెట్టొద్దు : సీఎం రేవంత్ ఆదేశాలు
ప్రతి పేద కుటుంబం ఆరోగ్యశ్రీ సేవలను ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సీఎం మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమై మాట్లాడారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దన్న సీఎం.. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వాటి అమలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో సేవలందించే వైద్యలకు మంచి పారితోషికం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ వైద్యం మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతీ బెడ్కు సీరియల్ నెంబర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని, గిరిజనులకు సరైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఆస్పత్రుల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా కలెక్టర్లు చూడాలని సీఎం సూచించారు.