యంగ్ ఇండియా స్కూల్స్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కన్ఫ్యూషన్ పేరుతో కుట్ర చేస్తున్నది మండిపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను మూసివేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. జీవోలకు, ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రకటనలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదని విమర్శించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పలుచోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు శంకుస్థాపనలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమి పూజ జరిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.