PAWAN: తెలుగు చిత్ర పరిశ్రమపై పవన్ సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత లేదన్న పవన్... వైసీపీ ఎలా చూసిందో మర్చిపోయారా అన్న డిప్యూటీ సీఎం..;
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా... ? సినీ పెద్దలు, అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని పవన్ అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరిచిపోయారని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తానని అన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే, జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్కల్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
గతాన్ని మర్చిపోయారా?
ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా, ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబును కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు. ‘అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు. అగ్ర నటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకుందో అందరూ మర్చిపోయారు. నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా’’అని పవన్ సూటిగా ప్రశ్నించారు.
ఇక వ్యక్తిగతంగా రావద్దు
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చని తాను చెప్పినట్లు పవన్ గుర్తు చేశారు. అయినా, ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తా అని పవన్ అనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని... సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని కూడా తేల్చేశారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తా అని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్ర పరిశ్రమపై తన అభిప్రాయాన్ని ఘాటుగా ప్రకటన రూపంలో తెలిపారు.
స్పందించిన నిర్మాత బన్నీ వాసు
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఈ రాజకీయాల గొడవల్లో సినీ పరిశ్రమ నలిగిపోతోంది అనేది ఇప్పటికైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గ్రహించాలన్నారు. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే.. మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని బన్నీ వాసు ఎక్స్లో ట్వీట్ చేశారు. పెద్ద సమస్యలను పరిష్కరించడపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసర సమస్యలను సృష్టించారని నిర్మాత నాగవంశీ అన్నారు.