మధ్యప్రదేశ్లో నిర్మించిన ఓ వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే ఇందుకు కారణం. ఈ వంతెనకు సంబంధించిన మీడియా కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఇలాంటి డిజైన్లు ఎలా ఆమోదించారు? అధికారులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజధాని నగరం భోపాల్లోని ఐషాబాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే పైవంతెన నిర్మించారు. వినూత్నంగా దీన్ని 90 డిగ్రీల వంపుతో నిర్మించడం విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం సదరు డిజైన్ను సమర్థించుకుంది.
సమీపంలో మెట్రోరైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించాల్సి వచ్చిందని, ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదని వివరణ ఇచ్చింది. కాగా, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వంతెన నిర్మాణంలో భాగమైన మరొక విశ్రాంత చీఫ్ ఇంజినీరైపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించింది. ఐష్బాగ్ ఆర్వోబీ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించాను. నివేదిక ఆధారంగా 8 మంది పీడబ్ల్యూడీ ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నాను. ఇందులో ఏడుగురు ఇంజినీర్లను తక్షణమే సస్పెండ్ చేశాం. నిర్మాణ ఏజెన్సీ డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. ఆర్వోబీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశాం అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పష్టంచేశారు.