Japan Airlines : మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్లైన్స్ విమానం..
విమానంలో 375 మంది ప్రయాణికులు..;
టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన జేఏఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది. విమానాశ్రయంలోని రన్ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఆ దేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ NHK ప్రసారం చేసిన వీడియోల్లో విమానం కిటికీల నుంచి మంటలు రావడం కనిపించింది. కాగా.. ఈ ప్రమాదానికి కారణం కోస్ట్ గార్డ్ ఎయిర్క్రాఫ్ట్ను ఢీ కొట్టడమేనని తెలిపింది.
జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన జేఏల్ 516 విమానం మంగళవారం టోక్యో ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదానికి గురైంది. హనేడా విమానాశ్రయం రన్వేపై దిగుతుండగా అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్క్రాఫ్ట్ ను ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. కొద్ది ప్రమాదం తర్వాత అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్పోర్ట్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. 70కిపైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది ఉన్నారని ఎన్హెచ్కే పేర్కొన్నట్లు జపాన్ టైమ్స్ వెల్లడించింది. అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విమానంలో కూర్చుకున్న ప్రయాణికులు కొందరు కిటికీల నుంచి ఆ ఘటనకు చెందిన వీడియో తీశారు. మంటల వల్ల విమానంలో పొగ కమ్ముకున్నది. ఆ సమయంలోనూ కొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లతో వీడియో తీశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమవారమే భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పెను నష్టం జరిగింది. సుమారు 155 సార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతోనే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం ధాటికి అనేక ప్రదేశాల్లో రోడ్లు, మెట్రో స్టేషన్లు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య 48కి దాటింది. ఈ ఘటన నుంచి కోలుకోకముందే భారీ విమాన ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.