Canada: స్టూడెంట్ వీసాలపై కోత విధిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటన..
ఈ ఏడాది కెనడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టడీ పర్మిట్లలో 35 శాతం మేర కోత;
అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే వీసాల్లో కోత విధించినట్లు కెనడా కీలక ప్రకటన చేసింది. హౌజింగ్, హెల్త్కేర్పై ప్రభావం పడుతున్న నేపథ్యలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఇమ్మిగ్రేషన్ జరుగుతున్న సందర్భంలో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ఈ అంశంపై స్పందించారు. 2024లో స్టూడెంట్ వీసాల్లో 35 శాతం కోత ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్లో తీవ్ర స్థాయి ఫ్రాడ్ జరుగుతోందని, దీంతో హౌజింగ్, హెల్త్కేర్ రంగాలపై ప్రభావం పడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కేవలం 3,64,000 మందికి స్టూడెంట్ వీసాలు ఇవ్వనున్నారు. గత ఏడాది 5,60,000 మంది విద్యార్థులకు వీసా జారీ చేశారు.
వలసల విధానం సమగ్రతను, విద్యార్థుల కెరీర్లో విజయం, ఇళ్లకు డిమాండ్ను సమతులీకరించేందుకు ఈ పరిమితి విధించామని మంత్రి మార్క్ మిల్లి మాంట్రియాల్లో జరిగిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ విద్యార్థులకు సరిపడా వనరులు లేవని తెలిసీ వారిని ఆహ్వానించడం హానికారక చర్యే. ఫలితంగా వారి కలలన్నీ చెదిరిపోయి కెనడా విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తితో వెనుదిరగాల్సి వస్తుంది’’ అని మంత్రి వెల్లడించారు.
దేశంలో సుమారు పది లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని కెనడా ప్రభుత్వం తెలిపింది. పదేళ్ల క్రితం ఉన్న విద్యార్థుల సంఖ్య కన్నా ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. క్రమక్రమంగా విద్యార్థుల ఎంట్రీపై ఆంక్షలను కఠినతరం చేయనున్నట్లు మంత్రి మిల్లర్ వెల్లడించారు. కెనడాలో గత ఏడాది జనాభాలో కొత్తగా పది లక్షల మంది కలిశారు. దీంతో కెనడా జనాబా దాదాపు 4 కోట్లకు చేరుకున్నది. ఇక జనాభా పెరగడంతో ఖర్చులు, కిరాయిలు పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీసాలపై కెనడా తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నది.
అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్లపై కూడా పరిమితి విధిస్తామని అన్నారు. భారీ ఫీజులు వసూలు చేస్తూ నాణ్యమైన విద్య అందించని ప్రైవేటు, బోగస్ విద్యాసంస్థలపై కూడా ఉక్కుపాదం మోపుతామని మంత్రి హెచ్చరించారు. ‘‘నిరర్ధక డిగ్రీలు పొందిన విద్యార్థులు చివరకు క్యాబ్లు నడుపుకుంటూ ఉండటం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం కాదు కదా!’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడెంట్ పర్మిట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని, దీన్ని సరిదిద్దాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.