G7 Summit: జీ 7 సమ్మిట్లో మెలోనితో -మోడీ
ట్రెండింగ్లో ‘మెలోడీ’ మూమెంట్;
కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ-ఇటలీ ప్రధాని మెలోని కలుసుకున్నారు. ఇద్దరి కలిసి కరచాలనం చేసుకున్నారు. చాలా సేపు షేక్హ్యాండ్ ఇచ్చుకుంటూ.. ఇద్దరు నవ్వుకుంటూ సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మెలోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతదేశంతో ఇటలీ గొప్ప స్నేహంతో ముడిపడి ఉందని రాసుకొచ్చారు. దీనికి ప్రధాని మోడీ కూడా రీట్వీట్ చేస్తూ.. మెలోని భావనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఇటలీతో భారతదేశ స్నేహం మరింత బలపడుతుందని.. ఇది ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది! అని మోడీ పేర్కొన్నారు.
కెనడా ప్రధాని కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కెనడా వెళ్లారు. వాస్తవానికి జీ 7లో భారతదేశం భాగం కాదు. కానీ 2019 నుంచి మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఇటలీ ప్రధాని మెలోనితో మోడీ సమావేశం అయ్యారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ-మెలోని కరచాలనం చేసుకున్నారు. ఇద్దరూ చాలాసేపు నవ్వుకుంటూ ముచ్చటించుకున్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి నిబద్ధతను వ్యక్తం చేశారు.
ఇక సోమవారం జీ 7 సమ్మిట్ ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతుండగా మెలోని-మాక్రాన్ కూడా గుసగుసలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. చాలాసేపు గుసగుసలాడారు.