Mexico: భారత్ సహా పలు దేశాలపై మెక్సికో 50% సుంకాలు
వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానున్న అధిక సుంకాలు
దిగుమతి వస్తువులపై మెక్సికో కూడా అమెరికా బాటలో పయనిస్తోంది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన దాదాపు 1,400 ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాల విధింపునకు అక్కడి సెనేట్ ఆమోదం తెలిపింది. వచ్చే జనవరి నుంచి అధిక సుంకాలు అమల్లోకి రానున్నాయి.
చైనా, భారత్తో పాటు దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాల నుంచి దుగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, విడిభాగాలు, టెక్స్టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులపై సుంకాలు పెంచాలని మెక్సికో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ దేశ ఆర్థిక మంత్రి సెప్టెంబరులోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభలో అధికార మోరేనా పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ మద్దతు లభించలేదు. తాజాగా మద్దతు లభించడం గమనార్హం. అధిక సుంకాల విధింపునకు సెనెట్ ఆమోదం తెలపడంపై అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పందించారు.
దేశీయ ఉత్పత్తి పెంచడం, చైనాతో వాణిజ్య సమతౌల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో అధిక సుంకాల విధింపు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా తెలిపారు. అమెరికాను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా క్లాడియా ప్రభుత్వం అధిక సుంకాలను విధించి ఉంటుందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్పై మెక్సికో ప్రభావం
భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించాలన్న మెక్సికో నిర్ణయం ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. 2024లో భారతీయ దిగుమతులు అత్యధికంగా 1,170 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. మెక్సికన్ ఎగుమతులకు భారత్ 9వ గమ్యస్థానంగా ఉంది. ప్రస్తుతం మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల కన్నా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులే అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు 2024లో మెక్సికోకు భారతీయ ఎగుమతుల విలువ 890 కోట్ల డాలర్లు ఉండగా దిగుమతుల విలువ 280 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. భారత్కు అనుకూలంగా వాణిజ్య వ్యత్యాసం ఉంది. 2024లో భారత్ నుంచి ప్రధానంగా మోటారు కార్లు, ఆటో విడిభాగాలు, ఇతర ప్యాసింజర్ వాహనాలను మెక్సికో దిగుమతి చేసుకుంది. ఈ వస్తువులపై మెక్సికో ఇప్పుడు భారీగా సుంకాలు విధించడంతో వచ్చే ఏడాది ఈ వస్తువుల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.